*– ఎంఆర్పీపై వివాదం ఉద్రిక్తతకు దారి •
*– అయ్యప్ప స్వాముల నిరసన
అక్షర గళం, హైదరాబాద్:
శబరిమల యాత్రలో భాగంగా పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తుడిపై జరిగిన దాడి ఉద్రిక్తతకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దారిలో పళనిని సందర్శించగా ఈ ఘటన జరిగింది.
ఎంఆర్పీపై వాగ్వాదం ఘర్షణగా మారింది
బృందంలోని ఒక భక్తుడు సమీప దుకాణంలో నీళ్లు, కూల్డ్రింక్లు కొనుగోలు చేయడానికి వెళ్ళాడు. ఎంఆర్పీ రూ.30గా ఉండగా, దుకాణదారు రూ.40 ఇవ్వాలని ఒత్తిడి చేశాడని భక్తులు తెలిపారు. ఈ విషయంపై బాధిత భక్తుడు ప్రశ్నించగా, దుకాణదారు తమిళంలో అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
గాజు సీసాతో దాడి – భక్తుడికి తీవ్ర గాయాలు
వాగ్వాదం ఉధృతమవడంతో దుకాణదారు అకస్మాత్తుగా గాజు సీసాతో భక్తుడిపై దాడి చేశాడు. తలకు గాజు తగలడంతో భక్తుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సహయాత్రీకులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
బాధ్యులపై చర్యలు కోరుతూ అయ్యప్ప స్వాముల ధర్నా
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప స్వాములు ఆలయ సమీపంలోనే నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
